జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లదంటూ హైకోర్టులో వ్యాజ్యం

  • జస్టిస్ కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమిస్తూ జూన్‌లో జీవో
  • వయసు రీత్యా అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ హైకోర్టులో పిల్
  • ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం
ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్‌ నియామకం చెల్లదని, ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధమంటూ గుంటూరుకు చెందిన న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

జస్టిస్ కనగరాజ్‌ను పీసీఏగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను సవాలు చేసిన ఆయన.. దానిని కొట్టి వేయాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్, వ్యక్తిగత హోదాలో జస్టిస్ వి. కనగరాజ్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

కనగరాజ్ వయసు 78 ఏళ్లని, అథారిటీ చైర్మన్ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు వచ్చే వరకే ఆ పదవిలో ఉండాలని పేర్కొన్నారు. కానీ ఆయన నియామకం విషయంలో ఈ విషయాన్ని గాలికొదిలేశారని, అర్హత లేని వ్యక్తిని పీసీఏ చైర్మన్‌గా నియమించారని అందులో పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన నియామకం పీసీఏ నిబంధన 4(ఏ)కి విరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 20న జారీ చేసిన ఆ జీవోను కొట్టివేయాలని కోరారు.

Justice Kanagaraj
Andhra Pradesh
AP High Court
PIL

More Telugu News